మాగంటి గోపీనాథ్ భౌతికకాయం వద్ద కేసీఆర్ కంటతడి

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూత
  • గుండెపోటుతో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిక
  • నివాళులర్పిస్తూ భావోద్వేగాలకు గురైన మాజీ సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం కన్నుమూశారు. మూడు రోజుల క్రితం తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఇటీవలే శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని తెలిసింది.

గోపీనాథ్ మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మాదాపూర్‌లోని డాక్టర్స్ కాలనీలో ఉన్న గోపీనాథ్ నివాసానికి చేరుకున్న కేసీఆర్, ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. 

గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు, ఎంపీ రవిచంద్ర తదితరులు కూడా గోపీనాథ్‌కు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతకుముందు, గోపీనాథ్ మృతి పట్ల కేసీఆర్ ఒక ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Maganti Gopinath
BRS MLA
Jubilee Hills
KCR
KTR
Harish Rao
Telangana Politics
Heart Attack
Passes Away
Condolences

More Telugu News